నవతెలంగాణ-హైదరాబాద్: ప్రభుత్వ నియమాక పోటీ పరీక్షల్లో జరిగిన లీక్ లను వ్యతిరేకిస్తూ జార్ఖండ్ విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) నిర్వహించిన పరీక్షలలో అక్రమాలకు వ్యతిరేకంగా రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో విద్యార్థులు చేస్తున్న నిరసన వరుసగా 24వ రోజుకు చేరుకుంది.సీబీఐ ద్వారా సమగ్ర దర్యాప్తు జరగాలని, బాధ్యులకు కఠిన శిక్ష పడాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ కు లేఖ రాశారు. నిరసన చేస్తున్న విద్యార్థులతో నేరుగా వెళ్లి చర్చలు సాగించాలని ఆయన లేఖలో సూచించారు. గత కొన్ని నెలలుగా విద్యా వ్యవస్థలో పేపర్ లీక్లు మరియు అవకతవకలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు పూర్తి మద్దతును అందించామన్నారు.
“వారి నిరసన శాంతియుతంగా ఉంది, వారి డిమాండ్లు న్యాయబద్ధమైనవి. మీరు ఏర్పాటు చేసిన ఒక కమిటీ ద్వారా జార్ఖండ్ ప్రభుత్వం వారితో సంప్రదింపులు ప్రారంభించడాన్ని నేను అభినందిస్తున్నాను. విద్యార్థులు లేవనెత్తిన అనేక డిమాండ్లపై ఏకాభిప్రాయం కూడా కుదిరిందని నేను నమ్ముతున్నాను. అయినప్పటికీ, నిరసనలు కొనసాగుతున్నాయి, కొంతమంది విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్షలో ఉన్నారు. యువతే భారతదేశ భవిష్యత్తు. దయచేసి వారి మాటలను ఓపికగా విని, ఈ సమస్య పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోండి” అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.
:


