నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్ర రాజధాని ముంబై రాజధానిని వర్షాలు ముంచెత్తు తున్నాయి. కేవలం నాలుగు గంటల్లోనే 100 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదయింది. రాత్రంతా కురిసిన వర్షాల కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై నడుముల లోతు వరకు నీళ్లు నిల్వడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంధేరి సబ్వే( Andheri Subway) పూర్తిగా నీట మునిగిపోవడంతో అధికారులు ఆ రూట్లలో వాహనాల రాకపోకలకు నిలిపివేశారు.
ముందస్తు జాగ్రత్త చర్యగా అర్ధరాత్రి 1:46 గంటల నుండే అంధేరి సబ్వేలో వాహనాల రాకపోకలు నిలిపివేయబడ్డాయి. ముంబై, సమీప ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఉరుములతో కూడిన మెరుపులు, మోస్తరు వర్షంతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్డీ) హెచ్చరించింది.



