– రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి శ్రీ కలెక్టర్ రాజర్షిషా
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ రాజర్షిషా ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రిజిస్టర్తో పాటు ఆన్లైన్ విధానాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఇప్పటివరకు అదిలాబాద్ మార్కెట్ యార్డ్లో 3,415 మంది రైతుల నుంచి 82వేల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేసినట్టు సెంట్రల్ ఇన్చార్జ్ పండరి తెలిపారు. ఇంకా 15 వేల క్వింటాళ్ల జొన్నలు రావచ్చని అంచనా వేశామని తెలిపారు.
ఇచ్చోడ మార్కెట్ యార్డు తనిఖీ…
అనంతరం ఇచ్చోడ మార్కెట్ యార్డ్ను తనిఖీ చేసి అక్కడ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 2,119 మంది రైతుల నుంచి 40వేల 5వందల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేసినట్టు సెంటర్ ఇన్చార్జ్ ఆర్.ఈశ్వర్ కలెక్టర్కు వివరించారు. వర్ష సూచనలు ఉన్నందున అధికారులు రైతులకు ఇబ్బంది కలుగకుండా ఈనెల 31వ తేదీ వరకు కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు.
జొన్నలు తరలింపులో జాప్యానికి తావుండొద్దు..
ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ జొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను రిజిస్టర్లతో పాటు ఆన్ లైన్ విధానాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? ధాన్యానికి తరుగు ఏమైనా తీస్తున్నారా అని ఆరా తీశారు. రైతులు జొన్నలు తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని అధికారులకు సూచించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే లారీలలో లోడ్ చేయించి, రైతుల నుంచి ధాన్యం తీసుకున్న వెంటనే టోకెన్లు అందించాలన్నారు. కేంద్రాల వద్ద సరిపడా సంఖ్యలో హమాలీలు సేవలందించేలా ఏర్పాట్లు ఉండాలని, రైస్ మిల్లుల వద్ద కూడా ధాన్యం లోడ్లతో కూడిన లారీలు నిలిచి ఉండకుండా ఎప్పటికప్పుడు ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకాల వర్షాల కూరుస్తున్నందున రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా జొన్నలను కొనుగోలు కేంద్రాలకు తరలించాలని, ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా సహకార అధికారి బి మోహన్, మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ ఉన్నారు.