నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు. రష్యా ప్రభుత్వ ప్రధాన కార్యాలయం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరి ఉషకోవ్ మంగళవారం తెలిపారు. న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం-2026లో పాల్గొంటారు. ఇటీవల ఢిల్లీ వేదికగా బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో రష్యా విదేశాంగ మంత్రి సర్జే లావ్రోవ్ హాజరయ్యారు. చివరిసారిగా బ్రిక్స్ నేతలు బ్రెజిల్లోని రియో డి జనీరోలో గత ఏడాది జూలైలో జరిగిన 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు.
బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికాతో కూడిన అంతర్జాతీయ కూటమిగా బ్రిక్స్ ఏర్పాటైంది. కూటమి విస్తరణలో భాగంగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ కూడా చేరాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 11కు చేరింది.


