నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్: ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు, సీపీఐ(ఎం) సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి (88) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వయోభారంతో పాటు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నాలుగు రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆరోగ్యం మరింత విషమించడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.

మల్లారెడ్డి భౌతికకాయన్ని నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్, కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బాబురావు తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన మరణం పట్ల పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు, రైతాంగ పోరాటాలకు తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు ఎంబీ భవన్కు ఆయన భౌతికకాయన్ని తరలించి అక్కడ అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నారు. మల్లారెడ్డికి భార్య భాగ్యలక్ష్మి, కుమారులు వాసుదేవరెడ్డి, మధుసూదన్రెడ్డి, కుమార్తె అజిత ఉన్నారు. పెద్ద కుమార్తె అనిత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.



