– కాంగ్రెస్ ప్రభుత్వంపై బీడీ కార్మికుల నిరసన
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
బీడీ కార్మికులందరికీ ప్రభుత్వం ఇచ్చిన హామీన రూ.4వేల జీవన భృతి ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు వెంగల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బీడీ కార్మికులందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా రూ.4వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బీడీ కంపెనీలో ప్రభుత్వంపై బీడీ కార్మికులు సోమవారం నిరసన తెలిపారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికుల అందరికీ అండగా ఉంటామని,రూ.4వేల జీవన భృతి ఇచ్చి ఆదుకుంటామని, మేనిఫెస్టోలో చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలు గడుస్తున్న ఇంతవరకు బీడీ కార్మికులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పెద్ద ఎత్తున మహిళ బీడీ కార్మికులు ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమ బీడీ పరిశ్రమనే అన్నారు. దాదాపు తెలంగాణ ప్రాంతంలో ఎనిమిది లక్షల మంది బీడీ కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. నెలలో 26 రోజులు నడవలసిన ఈ పరిశ్రమ కేవలం 10 రోజులు మాత్రమే నడుస్తుండటంతో కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొన్నదన్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న బీడీ కార్మికులందరికీ గత ప్రభుత్వం కెసిఆర్ రూ.2016 జీవన భృతి ఇచ్చి ఆదుకున్నారని అన్నారు. గత ప్రభుత్వం రూ.2016 ఇస్తే మేము నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించి 2014 ఫిబ్రవరి 28 లోపు ఉన్న కటప్ తేదిని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.కేవలం ప్రహరీ గోడకే పరితమైన ఈ ఎస్ ఐ హాస్పిటల్ ను ఈ ప్రాంత ఎంపీ,కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ బద్దెనపల్లిలోని 100 పడకల ఈ ఎస్ ఐ హాస్పిటల్ నిర్మించి బీడీ కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్మిక విభాగం,బి ఆర్ టి యు నాయకులు కొక్కుల ప్రసాద్.నాంపల్లి రామస్వామి. కొమురయ్య. జిందం రమేష్. మల్లేశం తో పాటు బీడీ కార్మికులు పాల్గొన్నారు.