సామాజిక తనిఖీ గ్రామ సభ..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సామాజిక తనిఖీ గ్రామ సభను నిర్వహించారు. ఇండిపెండెంట్ అబ్జర్వర్ ఆంధ్రయ్య  అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల కేంద్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా  గ్రామంలో జరిగిన వివిధ పనులను సభలో డిఆర్పీ నవీన్ చదివి వినిపించారు. అనంతరం ఉపాధి హామీ పథకంలో చేపట్టిన అన్ని పనులపై గ్రామ సభలో చర్చించారు. సామాజిక తనిఖీ బృందం సభ్యులు తమ పరిశీలనలో గుర్తించిన అంశాలను సభలో వివరించారు. ఉపాధి హామీ పనులకు కూలీలు హాజరైన సంతకాలు తీసుకోకపోవడం పట్ల సిబ్బందిపై  అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలు చేసిన పనుల్లో పలుచోట్ల కొలతలు తేడా ఉన్నట్లు సామాజిక తనిఖీ బృందం సభ్యులు గుర్తించారు. అలాంటి చోట్ల మళ్లీ పనులు చేయించాలని ఉపాధి సిబ్బందికి సూచించారు. మొత్తంగా గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ గ్రామ సభలో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు అజ్మత్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి శాంతి కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ రమ, ఆశా కార్యకర్తలు, వీఆర్పీలు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love