స్థానిక రౌడీ షిటర్ల కదలికలపై నిఘా ఉంచాలి
నవతెలంగాణ-అచ్చంపేట
నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం మండల పరిధిలోని సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్ ను, సబ్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. స్టేషన్ కి వచ్చే బాధితులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని, వారు ఇచ్చే ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి, పారదర్శక విచారణ ద్వారా సత్వరమే న్యాయం చేయాలన్నారు.
అదేవిధంగా స్థానిక రౌడీషీటర్ల వివరాలను అడిగి తెలుసుకొని, వారి కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. సబ్ డివిజనల్ ఆఫీస్, సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్ ల రిసెప్షన్, రైటర్ ఇతర సిబ్బంది పనితీరును సమీక్షించి, వారి విధులకు సంబంధించి పలు సూచనలు చేశారు. డీఎస్పీ ఆఫీస్ లో, సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్ లో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట డిఎస్పి శ్రీనివాస్ , అమ్రాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రయ్య , డిసిఆర్బి ఎస్ఐ రమేష్ ,అచ్చంపేట ఎస్సై నరేష్ , సిద్దాపూర్ ఎస్సై అంజయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



