జానీ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

– ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర కౌన్సిల్‌ డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టాలీవుడ్‌ మహిళా కొరియాగ్రాఫర్‌ను లైంగికంగా వేధించిన జానీ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌ (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. సినీ పరిశ్రమలో లైంగిక, మానసిక వేధింపులపై పిర్యాదులు వచ్చినా పరిశ్రమ మద్దతూ లేకపోవడంతో పోలీసులు కేసులు నమోదు చేయలేక పోతున్నారని ఆసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, అధ్యక్షురాలు సజన, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సదాలక్ష్మి బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌లో లైంగిక వేధింపుల ఫిర్యాదుల ప్యానల్‌ ఉన్నప్పటికీ, సంఘటనలు పెరుగుతూనే ఉన్నాయనీ, ఆ ప్యానల్‌ మహిళలకు ధైర్యం కల్పించడంలో విఫలం అయ్యిందని విమర్శించారు. పోలీసులు జానీ మాస్టర్‌పై పోక్సో కేసు పెట్టి, భాదితురాలికి అండగా ఉండాలని డిమాండ్‌ చేశారు.

Spread the love