సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబి
డీవైఎఫ్ఐ త్రిపుర రాష్ట్ర కార్యదర్శి నబరున్ దేవ్
నివాసాన్ని సందర్శించిన బృందం
అగర్తల : డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గూండాలు ధ్వంసం చేసిన డీవైఎఫ్ఐ త్రిపుర రాష్ట్ర కార్యదర్శి నబరున్ దేవ్ నివాసాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఆయనతో పాటు పొలిట్బ్యూరో సభ్యులు, త్రిపుర రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి, ఇతర సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నబరున్ దేవ్, ఆయన కుటుంబ సభ్యులతో పార్టీ నేతలు మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నబరున్ దేవ్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీజేపీ గూండాలు బెదిరించి అడ్డుకోవడంతో నిలిపివేసిన సంగతి తెలిసిందే. అదే రోజున సెపాహిజాలా జిల్లాలోని కలంచౌరాలో, సీపీఐ(ఎం) మద్దతుదారులపై దాడి చేయడమే కాకుండా, జాతీయ జెండాను ఎగురవేయకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సేవా కార్యక్రమాలను అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్య వాతావరణానికి విరుద్ధమని మండిపడ్డారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో, త్రిపురలో ప్రస్తుతం అధికారంలో ఉన్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ఈ ఘటన నిదర్శనమన్నారు.
ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, ప్రజల భద్రతను దెబ్బతీస్తోందని తెలిపారు. రాష్ట్రంలో తమ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. న్యాయవాది, మహిళా కార్యకర్త ఏర్పాటు చేసిన సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంపై బీజేపీ గూండాలు దాడి చేసి, పూర్తిగా ధ్వంసం చేశారని మండిపడ్డారు. అంతేకాక తమ కార్యకర్తలపై కూడా భౌతిక దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలను కూడా నాశనం చేశారని, అయితే ఈ ఫుటేజీ అందుబాటులో ఉందని తెలిపారు. బుధవారం సాయంత్రం 7.40 గంటల సమయంలో సుమారు 20 నిమిషాల పాటు దాడి జరిగినా పోలీసులు ప్రేక్షకుల్లా ఉండిపోయారని, ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. ఈ ఘటన ఒక్కటే కాదనీ, గడిచిన ఎనిమిదేండ్లలో ఇటువంటివి పదికి పైగా ఘటనలు జరిగాయని తెలిపారు. కేసులు కూడా నమోదు చేశారన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటన్నారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు లక్ష్యంగా దాడులకు దిగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను 300శాతం పెంచారని, కొంతమేర తగ్గించి, తగ్గించాం అంటూ బాకా ఊదుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల జీవనోపాధిపై దెబ్బ కొడుతున్నారనీ, ధరలు గణనీయంగా పెరిగాయనీ, నిరుద్యోగం పెరిగిపోయిందనీ, చాలా మంది యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాప్లు, లైంగికదాడులు పెరిగి పోయాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం క్రిమినల్స్లా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. క్రిమినల్ బుద్ధి కలిగిన రాజకీయ నేతలు అధికారంలో ఉన్నారని, ఈ రాజకీయ దిగజారుడు ధోరణిని ఎదుర్కొనేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.



