
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…
నవతెలంగాణ – వేములవాడ
కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రో జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్ లను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో చిటుమల్ల సౌజన్య సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి విద్యను అందించాలని విద్యలో అందరూ రాణించాలని ఏ ఒక్కరు కూడా విద్యకు దూరం కావద్దని ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడేలా ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్ధిక భారం పడకుండా ప్రభుత్వమే విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేయడం జరుగుతుందన్నారు. మొన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో గత సంవత్సరం 10వ తరగతిలో 10/10 మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం చేయడం ద్వారా రాబోవు రోజుల్లో వారిలో ఒక ఉత్సాహంనింపే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే వివిధ శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారు చెప్పింది విని ఆ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారని, అందులో భాగంగా పాఠశాల విద్య సంవత్సరం ప్రారంభం కాగానే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలఎత్తకుండా ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేసేలా ప్రోత్సాహం ఇచ్చారని అన్నారు.అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించడానికి శ్రీకారం చుట్టారని,విద్యను వైద్యాన్ని ప్రజలందరికీ అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వడానికి క్వాలిఫైడ్ టీచర్లచే విద్య బోధన చేయడం జరుగుతుందన్నారు. ప్రవేట్ పాఠశాలకు దీటుగా ఆంగ్ల మధ్యమంలో కూడా విద్య బోధన చేయడం జరుగుతుందన్నారు. గతంలో చాలామంది విద్యార్థులు పదవ తరగతి ,ఇంటర్ తర్వాత పై చదవులు చదువుకోలేక బొంబాయి దుబాయ్ వంటి ప్రాంతాలకు వెళ్లేవారని కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించి ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.తల్లిదండ్రులు గతంలో తమ చదువుకోలేదని తమ పిల్లల చదువుల కోసం కష్టపడి పని చేస్తే చదివిస్తున్నారని వారి నమ్మకాన్ని వాము చేయొద్దు అన్నారు..కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు.
రాష్ట్ర చరిత్రలోనే పాఠశాల ప్రారంభ మొదటి రోజు విద్యార్థులకు యూనిఫామ్స్ పుస్తకాల పంపిణీ చేయడం గొప్ప విషయం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు పాఠశాల జీవితం మళ్ళీ రాదని కష్టపడి చదువుతూ జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని పిలుపునిచ్చారు. పదవ తరగతి విద్యార్థులు 10/10 సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సన్మానం చేపిస్తామని హామీ ఇచ్చారు.విద్యార్థులకు తన వంతు ప్రోత్సాహం, సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో రమేష్, ఎంపీపీ మల్లేష్ యాదవ్, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ,విద్యార్థులు తోపాటు తదితరులు పాల్గొన్నారు.