1000 దాటిన మరణాల సంఖ్య..రెండు దేశాల్లో 10 వేలు దాటే అవకాశం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మయన్మార్ , థాయ్‌లాండ్ దేశాలను శుక్రవారం రెండు అత్యంత శక్తిమంతమైన భూకంపాలు కుదిపేసిన విషయం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకున్న భూ ప్రకంపనలతో మయన్మార్‌, థాయ్‌ దేశాలు వణికిపోయాయి. రోడ్లు, వంతెనలు, ఎయిర్‌పోర్ట్‌లు దెబ్బతిన్నాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ముఖ్యంగా మయన్మార్‌ ఈ విపత్తుకు తీవ్రంగా ప్రభావితమైంది. మృతుల సంఖ్య కూడా అక్కడ భారీగానే ఉంది. తాజా సమాచారం ప్రకారం రెండు దేశాల్లో భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,000 దాటింది.
ప్రకృతి ప్రకోపానికి మయన్మార్‌లో కనీసం 1002 మంది మరణించినట్లు మయన్మార్‌ మిలిటరీ అధికారులు ఈ ఉదయం ఓ ప్రకటనలో వెల్లడించారు. మరో, 2376 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. బ్యాంకాక్‌లో 10 మంది మరణించగా.. ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. అయితే రెండు దేశాల్లో మరణాల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉన్నదని అమెరికా ఏజెన్సీ అంచనావేసింది.

Spread the love