అత్యంత చిన్నవారు విజయ్ కుమార్ శర్మ.. పెద్ద వయస్కులు జ్ఞాన్శంకర్ మజుందార్
మహిళల హాజరు శాతం పెరుగుదల : వివరాలు వెల్లడించిన సీఐటీయూ కోశాధికారి ఎం.సాయిబాబు
విశాఖపట్నం నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభకు 1278 మంది ప్రతినిధులు హాజరయ్యారని ఆ యూనియన్ కోశాధికారి ఎం.సాయిబాబు తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలోని అనంతవట్టం ఆనందన్నగర్ వేదికపై మహాసభల సందర్భంగా క్రెడెన్షియల్ రిపోర్టును ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ 25 రాష్ట్రాలు, సెంటర్ నుంచి 1318 మందికి గానూ 1278 మంది హాజరయ్యారని తెలిపారు. అందులో 36 మంది ఆఫీసు బేరర్లు ఉన్నారన్నారు. పురుషులు 1002 మంది కాగా, మహిళలు 312 మంది హాజరయ్యారని తెలిపారు. మహిళా ప్రతినిధులు ఈ మహాసభకు 24 శాతం మంది హాజరయ్యారని తెలిపారు. గత మహాసభకు 22 శాతం మంది హాజరయ్యారని గుర్తుచేశారు. ఈ మహాసభలో మహిళల ప్రాతినిధ్యం రెండు శాతం పెరిగిందని తెలిపారు. మొత్తం 1212 క్రెడెన్షియల్ పత్రాలు తమకు అందాయని, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి 66 పత్రాలు అందాల్సి ఉందని చెప్పారు.
ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ సంఘాల నుంచి 12 మంది ప్రతినిధులు వచ్చారన్నారు. మహాసభలో 30 ఏండ్ల లోపు ప్రతినిధులు ఇద్దరు ఉన్నారనీ, 71 ఏండ్లకు పైబడిన వారు వంద మంది ఉన్నారని వివరించారు. ఈ మహాసభకు 232 మంది తొలిసారి హాజరయ్యారని తెలిపారు. వరుసగా 18 మహాసభలకు హాజరైన వారిలో ఏకే పద్మనాభన్, ఉన్నికృష్ణన్, సీకేకేఏ అలీ అక్బర్లు ఉన్నారని చెప్పారు. బీహార్ కు చెందిన గణేష్ శంకర్ సింగ్ తొమ్మిదేండ్లు అజ్ఞాతవాసం గడిపారని తెలిపారు. కామ్రేడ్ బిష్ణు మహంతి, నాలుగేండ్ల 9 నెలల 27 రోజులు జైలులో ఎక్కువ కాలం గడిపారని అన్నారు. ఈ సమావేశంలో ఆఫీస్ బేరర్లలో ఆహ్వానితుడైన జ్ఞాన శంకర్ మజుందార్(86) ప్రతినిధి అనీ, రాజస్థాన్ కు చెందిన విజయ కుమార్ శర్మ (28) అతి పిన్న వయస్కుడని తెలిపారు. మహిళా విభాగంలో త్రిపురకు చెందిన జయ బర్మాన్ (76) పెద్ద వయస్కురాలనీ, అస్సాంకు చెందిన కామ్రేడ్ రాధిక ఉరాంగ్ (30ఏండ్లు) అతి చిన్న వయస్కురాలని సభకు పరిచయం చేశారు. క్రెడెన్షియల్ కమిటీ 17 రాష్ట్రాలలో 5057 సభ్యత్వం కల్గిన 132 యూనియన్ల నుంచి అనుబంధ దరఖాస్తులను అందుకుందని సాయిబాబు తెలిపారు.



