- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతుల పాలిట శాపంగా మారాయని, ముఖ్యంగా వరి, జొన్న, మొక్కజొన్న, మామిడి పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి ఆగ్రహనికి గురవ్వడం పట్ల తెలంగాణ రైతు సంఘం డిమాండ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి, మిల్లులకు ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని శుక్రవారం ప్రెస్నోట్లో పేర్కొంది. వర్షానికి తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ఎటువంటి కోతలు లేకుండా, కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలి. ఈదురు గాలుల వల్ల నేలకొరిగిన మొక్కజొన్న, రాలిపోయిన మామిడి కాయల వల్ల నష్టపోయిన తోటల రైతులకు ఎకరాకు తక్షణ సహాయం ప్రకటించాలి. ఐకేపీ కేంద్రాల్లో తగినన్ని టార్పాలిన్ కవర్లు, గిడ్డంగుల సౌకర్యం కల్పించడంలో వైఫల్యం వల్ల రైతులకు నష్టం పెరుగుతోంది. దీన్ని యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దాలి. వర్షాల కారణంగా మంచిర్యాల వంటి ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ కోరారు.



