ఢిల్లీహైకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ : యూజీసీ- నెట్ 2026 పరీక్షను తిరిగి సెప్టెంబర్లో నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ప్రశ్నాపత్రాల్లో కొన్ని లోపాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, యూజీసీ- నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి సోషల్తో సహా మూడు సబ్జెక్టులకు పున:పరీక్ష నిర్వహిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ప్రశ్నాపత్రం లీకైందన్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ, పరీక్షను తిరిగి నిర్వహించే వరకు ఫలితాల విడుదలను నిలిపివేయాలని కోరుతూ జూన్ 30న సోషియాలజీలో పరీక్ష రాసిన ఒక అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జస్మీత్ సింగ్ విచారణ చేపట్టారు. ఇంగ్లీష్, కామర్స్ పేపర్లను సెప్టెంబర్ 9న, సోషియాలజీ పేపర్ను సెప్టెంబర్ 10న నిర్వహిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సొలిసిటర్ జనరల్ చేసిన ప్రకటన దృష్ట్యా, పిటిషన్లోని అభ్యర్థనకు ఇక ఆస్కారం లేదని, దీంతో పిటిషన్ పరిష్కరించబడిందని జస్టిస్ జస్మీత్ సింగ్ పేర్కొన్నారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్- స్కాలర్షిప్), అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్డీ ప్రోగ్రామ్లలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జూన్ 22 నుంచి 30 వరకు 87 సబ్జె క్టుల్లో యూజీసీ-నెట్ జూన్ 2026 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.
యూజీసీ- నెట్ పరీక్షలను సెప్టెంబర్లో నిర్వహిస్తాం
- Advertisement -
- Advertisement -



