నవతెలంగాణ – హైదరాబాద్ : ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్కు తన గైర్హాజరీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టోర్నీ నుంచి తప్పుకోవడం తన వ్యక్తిగత నిర్ణయం కాదని, ఆర్సీబీ యాజమాన్యమే ఆ నిర్ణయం తీసుకుందని చెప్పి వివాదానికి తెరలేపాడు. సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ ‘వ్యక్తిగత కారణాల’ వల్ల దయాల్ ఆడటం లేదని ప్రకటించారు. అయితే, దీనికి భిన్నంగా యశ్ దయాల్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడిన యశ్ దయాల్, తన గైర్హాజరీకి గల కారణాలను వివరించాడు. “నేను జట్టును చాలా మిస్ అవుతున్నాను. టీవీలో వాళ్లు ఆడుతుంటే చూడలేకపోతున్నాను. అయితే నన్ను జట్టు నుంచి తొలగించలేదు, రీటెయిన్ జాబితాలోనే ఉంచారు. నా స్థానంలో మరొకరిని తీసుకోలేదు. నేను జట్టుకు ముఖ్యమైన ఆటగాడినని వాళ్లు భావిస్తున్నారేమో. ఈ సీజన్ నుంచి తప్పుకోవడం నా వ్యక్తిగత నిర్ణయం కాదు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావొచ్చు, కానీ నిర్ణయం ఎప్పుడూ యాజమాన్యానిదే. ఆర్సీబీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో నాకు తెలియదు” అని దయాల్ పేర్కొన్నాడు. అదే సమయంలో ఆర్సీబీ యాజమాన్యంతో తాను నిరంతరం టచ్లోనే ఉన్నానని స్పష్టం చేశాడు. “నేను మేనేజ్మెంట్తో, డైరెక్టర్, కోచ్, దినేశ్ కార్తీక్తో మాట్లాడుతూనే ఉన్నాను. మా మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. అంతా స్పష్టంగానే ఉంది” అని తెలిపాడు.


