వైఎస్సార్‌ విగ్రహాలపై దాడులు.. ఖండించిన వైఎస్‌ షర్మిల

నవతెలంగాణ-హైదరాబాద్ :  ఏపీలో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయమని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదని విమర్శించారు. తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు అని షర్మిల అన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకమని అన్నారు. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదని.. గెలుపు ఓటములు ఆపాదించడం తగదని హితవు పలికారు. వైఎస్సార్‌ను అవమానించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు.

Spread the love