టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ఎందుకు మార్చారోఆత్మ విమర్శ చేసుకోవాలి
భవిష్యత్ రాజకీయాల్లో సామాన్యుడుపోటీ చేసే పరిస్థితి లేదు
ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేయాలి :శాసనమండలి చైర్మెన్ చిట్ చాట్
నవతెలంగాణ – నల్లగొండ టౌన్
జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. ఉన్న సీట్లకు 50 శాతం పెంచేలా కేంద్రం కొత్త విధానం ప్రతిపాదించిందన్నారు. 50 శాతం జనాభా, 50 శాతం జీఎస్టీ పరంగా చేయాలని పలు రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్నాయని, మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వేరువేరుగా పెట్టాలని కోరుతున్నాయని తెలిపారు. జమిలీ ఎన్నికలు జరిగితే 18 రాష్ట్రాలు ఒకసారి, మిగిలిన రాష్ట్రాలు ఒకసారి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణలో వివిధ రాష్ట్రాల నుంచి 20 లక్షల మంది కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్నారన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేస్తే తప్ప భవిష్యత్ రాజకీయాల్లో సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. అధికార పార్టీలో అసంతృప్తి సాధారణం అని చెప్పారు. బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మారుస్తారని ప్రచారం నడుస్తోందని, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ఎందుకు మార్చారో ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ధాన్యం కొనుగోళ్ల సమస్య క్లియర్ అయిందని, సన్న ధాన్యం సేకరణలో ఎక్కడా సమస్య లేదని చెప్పారు. సీఎంఆర్ ధాన్యం సేకరణలో పూర్తి స్థాయి నియంత్రణ ఉండాలన్నారు. మిల్లులను బంద్ చేయించే పరిస్థితి లేదని, అలా జరిగితే ధాన్యం కొనుగోలు చేసేవారు ఉండరని తెలిపారు. కేంద్రం 20 శాతం బాయిల్డ్ రైస్, 80 శాతం రా రైస్ ఇవ్వాలని అడుగుతోందని, కానీ మిల్లర్లు బాయిల్డ్ రైస్కు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఏఎమ్మార్పీ నుంచి 4000 క్యూసెక్కుల నీరు పారాలి కానీ, ప్రస్తుతం 2400 క్యూసెక్కులకు మించి నీరు ప్రవహించే పరిస్థితి లేదన్నారు. సాగునీటి కాలువలను విస్తరించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. లైనింగ్కు ముందే కాలువల విస్తరణ చేపట్టాలన్నారు.



