ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా మిట్టల్‌ను కొనసాగించాలి

– రాష్ట్ర ప్రభుత్వానికి టిప్స్‌, టిగ్లా, ఇంటర్‌ విద్యాఫోరం, : టీఎస్‌జీసీసీఎల్‌ఏ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా, ఇంటర్‌ విద్యా కమిషనర్‌గా నవీన్‌ మిట్టల్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో కొనసాగించాలని తెలంగాణ ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్‌), తెలంగాణ ఇంటర్మీడియట్‌ గవర్నమెంట్‌ లెక్చరర్స్‌ అసోస ియేషన్‌ (టిగ్లా), తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ఇంటర్‌ విద్యాఫోరం, తెలంగాణ ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్‌ లెక్చర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌జీసీ సీఎల్‌ఏ-475) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో శుక్రవారం విజ్ఞప్తి కార్యక్రమాన్ని నిర్వహించాయి. కాలేజీ ప్రిన్సిపాళ్లకు అధ్యాపకులు, కాంట్రాక్టు అధ్యాపకులు, గెస్ట్‌ లెక్చరర్లు వినతిపత్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, కార్యదర్శి వాకాటి కరుణకు ఆన్‌లైన్‌ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు. ఈ సందర్భంగా టిగ్లా అధ్యక్షులు మైలారం జంగయ్య, టిప్స్‌ రాష్ట్ర కన్వీనర్‌ మాచర్ల రామకృష్ణగౌడ్‌, ఇంటర్‌ విద్యాఫోరం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఆస్నాల శ్రీనివాస్‌, టీఎస్‌జీ సీసీఎల్‌ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కొప్పిశెట్టి సురేష్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ వస్కుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ అతితక్కువ కాలంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి, ఇంటర్‌ విద్యా కమిషనర్‌గా పనిచేసిన నవీన్‌ మిట్టల్‌ పారదర్శకంగా పలు సంస్కరణలు చేపట్టారని చెప్పారు. ఈ-ఆఫీస్‌, బయోమెట్రిక్‌, ఇంటర్‌ బోర్డు పాలకమండలి నిర్ణయంతో జవాబు పత్రాల ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేపట్టేందుకు ప్రక్రియ ప్రారంభించారని గుర్తు చేశారు. ఇంటర్‌ విద్య బలోపేతం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఇంటర్‌ వార్షిక పరీక్షలు ముగిసే వరకు ఆయన్ను కొనసాగించాలని కోరారు.

Spread the love