హమాస్‌ దాడిలో ఇజ్రాయెల్‌.. పంటపొలాలు 100 మృతదేహాలు లభ్యం

నవతెలంగాణ-హైదరాబాద్ :పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ దాడులతో ఇజ్రాయెల్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాలూ దద్దరిల్లుతున్నాయి. ఈ యుద్ధంలో రెండు వైపులా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగతోంది. ఇప్పటి వరకూ రెండు వైపులా 1,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు వేల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ దాడుల్లో 143 మంది పిల్లలు, 105 మంది మహిళలు సహా 704 మంది మరణించారు. 4,000 మందికి పైగా గాయపడ్డారు. ఇక హమాస్ దాడి కారణంగా ఇజ్రాయెల్‌లో కనీసం 900 మంది మరణించారు. 2,600 మంది గాయపడ్డారు. బందీలుగా ఉన్న 100 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు ఓ వ్యవసాయ పొలంలో లభించాయి. మరోవైపు హమాస్‌కు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ ఘాటు హెచ్చరికలు చేశారు. హమాస్‌ ఉగ్రవాద సంస్థ రహస్య స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. తమపై దాడితో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ చారిత్రక తప్పిదానికి పాల్పడిందని అన్నారు. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మంగళవారం మాట్లాడారు. యుద్ధం తాము ప్రారంభించలేదని తెలిపారు. కానీ, ఈ యుద్ధాన్ని మాత్రం తామే ముగిస్తామంటూ హమాస్‌కు గట్టిహెచ్చరికలు చేశారు.

Spread the love