Saturday, August 1, 2026
E-PAPER
Homeజాతీయం33 శాతం కోటాను తక్షణమే అమలు చేయాలి

33 శాతం కోటాను తక్షణమే అమలు చేయాలి

- Advertisement -


మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభించే వరకు పోరాటం
పదో రోజుకు మహిళా సంఘాలc ఐక్య ఆందోళన
రాజ్యసభ సీపీఐ(ఎం) పక్షనేత జాన్ బ్రిట్టాస్ సంఘీభావం


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ‘నేషనల్ కోయిలిషన్ ఫర్ ఉమెన్స్ రిజర్వేషన్స (ఎన్‌సీడ‌బ్ల్యూఆర్‌) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఐక్య ఆందోళన శుక్రవారం నాటికి పదో రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది మహిళలు, అలాగే కేరళ నుంచి వచ్చిన భారీ ప్రతినిధి బృందం రంగురంగుల బ్యానర్లు, ప్లకార్డులు, పోస్టర్లు, జెండాలతో ఆందోళనలో పాల్గొన్నారు.

బీజేపీది మనువాద కుట్ర : జాన్‌ ‌బ్రిట్టాస్‌
మహిళల రాజకీయ హక్కుల కోసం నిలకడగా పోరాడుతున్న వామపక్ష పార్టీల తరపున మద్దతు, సంఘీభావం తెలిపేందుకు రాజ్యసభ సీపీఐ(ఎం) పక్షనేత జాన్ బ్రిట్టాస్ ఆందోళన ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ చట్టం అమలును ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను ఆయన ‘మనువాద కుట్ర’గా అభివర్ణించారు. పోరాటంతో తమ హక్కులను ఎలా సాధించుకోవాలో దేశంలో మహిళలకు తెలుసునని, ప్రభుత్వాన్ని బాధ్యత నుంచి తప్పించుకోనివ్వరని ఆయన అన్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రజల ముందు బట్టబయలు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిరసన సభలో పలు మహిళా సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. వీరిలో ఐద్వా జాయింట్ సెక్రెటరీ, ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలు ఆశా శర్మ, ఎన్ఎఫ్ఐడ‌బ్ల్యూ జాతీయ నాయకురాలు మైమూనా మొల్లా, మణిపూర్ నుంచి అరుణ, రహీనా బేగం రాజ్, వైడబ్ల్యూసీఏ నుంచి ప్రజ్ఞ, ఏఐపీడబ్ల్యూఏ నుంచి పూజ తదితరులు ఉన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం నిరంతరం నిరాకరిస్తుండటంపై వక్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభించే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు పునరుద్ఘాటించారు. ఈ ధర్నాలో పాల్గొన్న సీనియర్ నాయకులలో ఐద్వా అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.కె. శ్రీమతి, కనినిక ఘోష్, జాతీయ కార్యదర్శి సి.ఎస్. సుజాత, ఢిల్లీ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు ఆశా యాదవ్, ఎన్ఎఫ్ఐడ‌బ్ల్యూ ప్రధాన కార్యదర్శి నిషా సిధు, ఎన్ఎఫ్ఐడ‌బ్ల్యూ నుంచి దీప్తి, సరస్వతి, ‘టుగెదర్ ఫర్ ట్రాంక్విలిటీ’ నుంచి భావన శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు ఈ ఆందోళన ప్రతిరోజూ కొనసాగుతుందని ‘నేషనల్ కోయిలిషన్ ఫర్ ఉమెన్స్ రిజర్వేషన్స్‌’ మరోసారి స్పష్టం చేసింది. 33 శాతం రిజర్వేషన్ అమలులో ఇక ఏమాత్రం జాప్యాన్ని దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు అంగీకరించబోరని వివరించింది. సమాన రాజకీయ ప్రాతినిధ్యం అనే రాజ్యాంగ హామీ వాస్తవ రూపం దాల్చే వరకు దేశవ్యాప్త ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -