జంతర్ మంతర్లో ఎన్సీడబ్ల్యూ ఆర్ ఆందోళన
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ కోయలిషన్ ఫర్ ఉమెన్స్ రిజర్వేషన్ (ఎన్సీడబ్ల్యూ ఆర్ ) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన సంయుక్త ధర్నా అచంచలమైన సంకల్పం, ఉత్సాహంతో రెండు వారాలుగా కొనసాగుతోంది. ఈ నిరసనలో ఢిల్లీ, హర్యానా, పలు ఇతర రాష్ట్రాల నుంచి మహిళలు, విద్యార్థులు, యువజన సంఘాలు, ఉద్యోగ మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఆందోళనలో ఐద్వా అధ్యక్షురాలు పి. కె. శ్రీమతి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సీనియర్ నాయకురాలు అనీ రాజా, ఏఐపీడబ్ల్యూ ఎ కార్యదర్శి శ్వేతా రాజ్, ఎఎల్ఐఎఫ్ఎ నేత సాగరిక, ఐసీడబ్ల్యూఎం నేత జాయిసియా తోరత్, టిఎఫ్టి నేత భావన, సిటియు వర్కింగ్ ఉమెన్స్ నేత సుధ, ఆశా వర్కర్స్ యూనియన్ నేత సునీత పాల్గొన్నారు.
శ్రీమతి టీచర్ మాట్లాడుతూ విద్య, ఉపాధిని పరిరక్షించడానికి విద్యార్థులు, యువత చేపట్టిన చారిత్రాత్మక ఉద్యమానికి అభినందనలు తెలిపారు. ఈ పోరాటం దేశవ్యాప్తంగా ప్రజలను ప్రజాస్వామ్య హక్కులు, ప్రజా విద్య కోసం నిలబడేలా ప్రేరేపించిందని అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం ఆమోదం పొందినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు, డీలిమిటేషన్ను ముందస్తు షరతులుగా చూపుతూ దాని అమలును ఆలస్యం చేస్తూనే ఉందని విమర్శించారు. ఇది మహిళలకు జరుగుతున్న తీవ్ర అన్యాయమని, దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలలో వారి సమాన భాగస్వామ్యాన్ని నిరవధికంగా వాయిదా వేసే ప్రయత్నమని ధ్వజమెత్తారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేమని నొక్కి చెప్పారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలును జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ నుండి వేరు చేసి, తక్షణమే అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తద్వారా లక్షలాది మంది మహిళలు రాజకీయ ప్రాతినిధ్యం కోసం తమ రాజ్యాంగ హక్కును వినియోగించుకోగలరని అన్నారు.
అనీరాజా మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కుల సాధనలో శాంతియుత నిరసనలు చేపట్టడం ఒక ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని, దానికి ఆటంకం కలిగించకూడదని పేర్కొంటూ, ధర్నా నిర్వహణపై ఏకపక్ష, అసమంజసమైన షరతులు విధిస్తున్నందుకు పోలీసు యంత్రాంగంపై విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలులో అనవసర జాప్యాన్ని అంతం చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని, మహిళలకు తక్షణ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.
మహిళలు, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలనే డిమాండ్ను హైలైట్ చేస్తూ నినాదాలతో పాటు పాటలు కూడా పాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను ఎటువంటి జాప్యం లేకుండా అమలు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని నిరసనకారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజాస్వామ్య సంస్థలు, మహిళా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజా ఉద్యమాలు ఈ పోరాటానికి తమ సంఘీభావాన్ని తెలియజేయాలని, 33 శాతం మహిళా రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలనే అంశంపై తమ గళాన్ని వినిపించాలని మహిళా రిజర్వేషన్ జాతీయ కూటమి పిలుపునిచ్చింది. నిరసనలో ఐద్వా ప్రధాన కార్యదర్శి కనినికా ఘోష్, కోశాధికారి తాపసి ప్రహరాజ్, ఉపాధ్యక్షులు మరియం ధావలే, ఎస్ పుణ్యవతి, జగమతి సంగ్వాన్, ఆశా శర్మ, సవిత, ఎన్ఎఫ్ఐడబ్ల్యు నాయకురాలు దీప్తి తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -



