Tuesday, May 13, 2025
Homeప్రధాన వార్తలుజీసీసీకి హబ్‌గా హైదరాబాద్‌

జీసీసీకి హబ్‌గా హైదరాబాద్‌

- Advertisement -

– ఏఐ-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రం
– అందుకే హైదరాబాద్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారండి
– పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్‌ పిలుపు
– సొనాటా సాఫ్ట్‌వేర్‌ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైదరాబాద్‌ మహానగరం సాఫ్ట్‌వేర్‌, లైఫ్‌ సైన్సెస్‌తోపాటు ఇంకా అనేక రంగాల్లో జీసీసీ (గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌)కి హబ్‌గా మారిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. అలాగే ఏఐ-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు ఇది కేంద్రంగా మారిందని ఆయన చెప్పారు. అందువల్ల హైదరాబాద్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారండి, ఘన విజయాలను సొంతం చేసుకోండంటూ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో సొనాటా సాఫ్ట్‌వేర్‌ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొనాటా సాఫ్ట్‌వేర్‌ అత్యాధునిక ఏఐని ఉపయోగించి పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణమని ప్రశంసించారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌, కాగ్నిజెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు తమ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్‌ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే పరిశ్రమలకు మద్దతునిస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతోందని వివరించారు. డిసెంబర్‌ 2023 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి కొత్తగా రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం లక్షకుపైగా ఉద్యోగాలను సష్టించిందని చెప్పారు. ఈ యేడాది దావోస్‌లో జరిగిన ఒప్పందాల ప్రకారం మన రాష్ట్రం రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టి నంబర్‌వన్‌గా నిలిచిందని వివరించారు. ఈ రకంగా దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. దీంతోపాటు పోలీసింగ్‌, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణ నిర్వహణ, ఉద్యోగాల సృష్టి, పన్ను వసూళ్లలో కూడా తెలంగాణ మొదటి స్థానంలో కొనసాగుతోందని విశ్లేషించారు. రాష్ట్రంలోని 66 లక్షల మంది మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారత లభించిందని అన్నారు. రాజీవ్‌ యువ వికాసం ద్వారా ప్రభుత్వం యువతకు వ్యాపార అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు. స్వయం ఉపాధికి అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ఫోర్స్‌లో ట్రాన్స్‌జెండర్‌ స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు. డ్రై పోర్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్‌ సముద్ర ఓడరేవుతో అనుసంధానం, ఫ్యూచర్‌ సిటీలో ఏఐ నగరం, యంగ్‌ ఇండియా స్కిల్స్‌, స్పోర్ట్స్‌ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణం కొనసాగుతున్నాయని వివరించారు. ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటిగా పేరొందిన మిస్‌ వరల్డ్‌ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయని గుర్తు చేశారు. భవిష్యత్తులో మరిన్ని ప్రపంచ ఈవెంట్ల నిర్వహణకు తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని వెల్లడించారు.
తెలంగాణ రైజింగ్‌ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ఒక ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్‌ను అత్యద్భుత నగరంగా తీర్చిదిద్దటంలో ప్రభుత్వానికి సహకారం అందించాలంటూ ఆయన ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను కోరారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -