నవతెలంగాణ – తంగళ్ళపల్లి : అవమానం భరించలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తంగళ్ళపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన కడమంచి స్వామి (34) భార్య స్వరూప కులవృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు. స్వామి స్నేహితుడైన టేకు ప్రేమ్ కుమార్ అప్పుడప్పుడు స్వామితో కలిసి ఇంటికి వచ్చేవాడని, అదే మాదిరిగా తన భర్త స్వామి లేని సమయంలో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి తనను బలాత్కారం చేయబోయాడని, భర్త ఇంటికి రావడంతో విషయం కాస్త తెలిపింది. వెంటనే స్వామి కుల పెద్దలను కలిసి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో ప్రేమ్ కుమార్ స్వామిని అందరి ముందు అవమానకరంగా నానా బూతులు తిడుతూ”నీవు చావు పోరా”అని బెదిరించాడు. దీంతో స్వామి అవమానం భరించలేక మంగళవారం తెల్లవారుజామున ఉదయం 3 గంటల ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య స్వరూప పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాగంటి స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. స్వామి మృతికి కారణమైన ప్రేమ్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్చార్జి ఎస్ఐ వినీత రెడ్డి తెలిపారు.



