నవతెలంగాణ-హైదరాబాద్ : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా బస్సుల్లో ఐ-ఎలర్ట్ పరికరాన్ని అమరుస్తున్నారు. దీని ద్వారా ఆర్టీసీ అధికారులు బస్సు ప్రయాణించే విధానాన్ని పర్యవేక్షించొచ్చు. డ్రైవర్ బస్సు నడుపుతున్న తీరు, వేసిన బ్రేకులు, వెళ్తున్న వేగం, గేర్ల మార్పు, ఎక్స్లేటర్ వేసిన విధానం, ఇంధన పొదుపు తదితర విషయాలన్నింటినీ తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా డ్రైవర్లకు గ్రేడింగ్ ఇస్తారు. 10 పాయింట్లకు 6లోపు గ్రేడింగ్ వస్తే సరిగా నడపనట్లు నిర్ధారిస్తారు. దాన్నిబట్టి వారికి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రమాదాలు నివారిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగితే.. ఆ సమయంలో బస్సు వేగం సహా పూర్తిస్థితిని ఈ డివైజ్ ద్వారా తెలుస్తుంది. ఒకరకంగా విమానాల్లో బ్లాక్బాక్స్ మాదిరే ఆర్టీసీ బస్సుల్లో ఐ-ఎలర్ట్ పనిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బీఎస్-6 బస్సుల్లో ఈ పరికరాల బిగింపు తుది దశకు చేరుకుంది. రానున్న రోజుల్లో ప్రతి బస్సులో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇటీవల అశోక్ లేల్యాండ్ సంస్థ ఇంజినీర్లు ఈ పరికరం పనితీరు, ఉపయోగించే విధానంపై డిపో మేనేజర్లు, భద్రతా అధికారులు, మెకానిక్లకు అవగాహన కల్పించారు. దీన్ని ఆరీ టెలీమ్యాటిక్స్ అని కూడా అంటారు.

                                    

