నవతెలంగాణ – హైదరాబాద్ : ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో స్విట్జర్లాండ్పై అదనపు సమయంలో 3-1 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో అట్లాంటాలో జరగనున్న సెమీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్తో తలపడేందుకు అర్హత సాధించింది. కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆరంభం నుంచే అర్జెంటీనా ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట 10వ నిమిషంలో కెప్టెన్ లియోనెల్ మెస్సీ అందించిన అద్భుతమైన క్రాస్ను అలెక్సిస్ మాక్ అలిస్టర్ హెడర్తో గోల్గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే, స్విట్జర్లాండ్ అంత సులభంగా లొంగలేదు. 67వ నిమిషంలో డాన్ ఎండోయె గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు.
మ్యాచ్ 72వ నిమిషంలో కీలక మలుపు తిరిగింది. డైవ్ చేసినందుకు వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) సమీక్ష తర్వాత స్విస్ ఆటగాడు బ్రీల్ ఎంభోలోకు రెండవ ఎల్లో కార్డ్ చూపడంతో రిఫరీ అతడిని మైదానం నుంచి పంపించేశారు. దీంతో స్విట్జర్లాండ్ 10 మంది ఆటగాళ్లతోనే పోరాడాల్సి వచ్చింది. నిర్ణీత సమయంలో మరో గోల్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. అదనపు సమయంలో అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట 112వ నిమిషంలో జూలియన్ అల్వారెజ్ 25 గజాల దూరం నుంచి కొట్టిన శక్తివంతమైన షాట్ నేరుగా గోల్ పోస్టులోకి దూసుకెళ్లడంతో అర్జెంటీనా 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇంజ్యూరీ టైమ్లో లౌటారో మార్టినెజ్ మరో గోల్ చేసి 3-1తో అర్జెంటీనా విజయాన్ని ఖాయం చేశాడు. ఈ ఓటమితో 1954 తర్వాత తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన స్విట్జర్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.


