– దేవరయంజాల్లో హైడ్రా అధికారుల చర్యలు
నవతెలంగాణ-శామీర్ పేట
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. తాజాగా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయంజాల్ ప్రాంతంలో నాలాపై నిర్మించిన ప్రహరీని కూల్చేశారు. నాలాను ఆక్రమించి వరద నీరు ప్రవాహానికి అడ్డంగా నిర్మించిన ప్రహరీ వల్ల ఇటీవల కురిసిన వర్షాలతో దేవరయంజాల్లోని మహాలక్ష్మి వెంచర్ సహా పలు కాలనీలు నీట మునిగాయి. దాంతో అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరగా.. వారు చూసీచూడనట్టు వ్యవహరించినట్టు ఆరోపణలు వచ్చాయి. అనంతరం బాధితులు హైడ్రాను ఆశ్రయించారు. దాంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మంగళవారం తూముకుంట మున్సిపల్ అధికారులతో కలిసి నాలాపై అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. బద్దం మహేందర్రెడ్డి అనే వ్యక్తి నాలా కబ్జా చేసి ప్రహరీ నిర్మించినట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ మేరకు సదరు కబ్జాదారుడిపై కేసు నమోదు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఈ చర్యల్లో హైడ్రా ఇన్స్పెక్టర్ మల్లేశ్వర్, అధికారులు, డిప్యూటీ ఈఈ సునిత, ఏఈ నిరీష, టీపీఎస్ స్రవంతి, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.



