నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయిన నేపథ్యంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది. గాలి నాణ్యతను మెరుగుపరచడంలో చైనా గణనీయమైన విజయాలు సాధించిందని, ఈ విషయంలో భారత్కు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత్లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూజింగ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రకటనలో తెలిపారు.
గతంలో పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చైనా, గాలి నాణ్యతను మెరుగుపరుచుకోవడంలో అద్భుతమైన ఫలితాలు సాధించింది. గాలి నాణ్యత ప్రమాణాలను నిర్దేశించి వాటిని తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన జరిమానాలు విధించడంతో పాటు శిక్షలు కూడా అమలు చేసింది. ఫలితంగా గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది.
కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో చైనా వేగంగా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లింది. విద్యుత్ వాహనాలు, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిపై భారీగా పెట్టుబడులు పెట్టింది. వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న సమయాల్లో కాలుష్య కారక కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేయడంతో పాటు కొన్ని కర్మాగారాలను పట్టణాలు, నగరాలకు దూరంగా తరలించింది. ఈ చర్యల ద్వారా పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగుపడింది. ఢిల్లీతో సహా భారత్లోని నగరాల్లో కూడా చైనా తరహా కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి మెరుగుపడుతుందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.



