నవతెలంగాణ-హైదరాబాద్ : దీపం అంటుకొని తీవ్ర గాయాలపాలైన ఏడేళ్ల చిన్నారి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఈ విషాద ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం మున్సిపాలిటీ ఆర్.ఎల్. నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులతో నాగారం మున్సిపాలిటీ లోని ఆర్.ఎల్. నగర్ లో నివాసముంటున్నారు. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించారు.
మధుసూదన్ రెడ్డి కుమార్తె సాయి నేహా రెడ్డి(7) కి ఇంట్లో ప్రమాదవశాత్తు దుస్తులకు దీపం అంటుకోవడంతో కేకలు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సైనిక్ పురిలోని ప్రయివేటు హాస్పిటల్ కి తీసుకెళ్లగా వైద్యుల సూచన మేరకు ఖార్కానాలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా, 90 శాతం శరీరం కాలిపోవడంతో పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.



