నవతెలంగాణ హైదరాబాద్: ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య మరువక ముందే ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులకు మరో చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. వియత్నాం ఎయిర్లైన్స్కు చెందిన వీఎన్-984 ఫ్లైట్ శుక్రవారం రాత్రి శంషాబాద్ నుంచి వియత్నాంకు బయలుదేరాల్సి ఉంది.
అయితే, ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎయిర్లైన్స్ సిబ్బంది సర్వీసును అకస్మాత్తుగా నిలిపివేశారు. దీంతో 200 మంది ప్రయాణికులు రాత్రంతా ఎయిర్పోర్టులోనే పడిగాపులుకాశారు. ఫ్లైట్ సర్వీసుపై సదరు ఎయిర్లైన్స్ సిబ్బందిని ప్రశ్నిస్తే.. వారు సమాధానం చెప్పకపోగా, బాధ్యత లేకుండా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు తమకు వెంటనే ఆల్టర్నేట్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని ఎయిర్పోర్టులోనే ఆందోళనకు దిగారు.



