నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇది కేవలం ఒక్క చోటుకే పరిమితమైన దాడి కాదని, 26/11 ముంబయి తరహాలో దేశవ్యాప్తంగా వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అత్యంత శక్తిమంతమైన 200 ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్) బాంబులను సిద్ధం చేసే పనిలో ఉగ్రవాదులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్రవాదుల టార్గెట్ లిస్టులో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం వంటి కీలక ప్రాంతాలు ఉన్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లు, రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్లోనూ విధ్వంసం సృష్టించాలని పథకం రచించారు. జనవరి నుంచే ఈ కుట్రకు ప్రణాళికలు జరుగుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కుట్ర వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దాడుల కోసం పనిచేస్తున్న ‘వైద్యుల టెర్రర్ మాడ్యూల్’ గుట్టును అధికారులు రట్టు చేస్తున్నారు. ఇటీవలే జమ్మూకశ్మీర్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్లలో కేంద్ర ఏజెన్సీలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ఈ కుట్ర తీవ్రతకు అద్దం పడుతోంది.
ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టింది. ఇందుకోసం 10 మంది సభ్యులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన 40 ఫోరెన్సిక్ నమూనాల్లో అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు పురోగతిపై చర్చించేందుకు బుధవారం సాయంత్రం ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్తో ఉన్నతస్థాయి సమావేశం కానున్నారు. ఈ ఉగ్ర ముఠా సభ్యులు టర్కీలో జైషే హ్యాండ్లర్లతో సమావేశమై కుట్రకు తుదిరూపు ఇచ్చినట్లు కూడా దర్యాప్తులో తేలింది. వాస్తవానికి దీపావళి పండుగ సమయంలోనే జనసమ్మర్థం ఉన్న ప్రదేశాల్లో దాడులు చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, అది విఫలమైంది. ఈ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 13 మంది మృతిచెందగా, అనేకమంది గాయపడ్డారు.



