– కార్పొరేట్లకే మోడీ గవర్నమెంట్ వత్తాసు
– దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు నిరాదరణ : రాహుల్ గాంధీ
దర్బంగా: దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతోనే ప్రధాని మోడీ కులగణనకు అంగీకరించారని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. వెనుకబడిన వర్గాల తరఫున పోరాడుతున్న ప్రతిపక్షానికి ప్రధాని భయపడ్డారని అన్నారు. బీహార్లోని దర్బంగాలో నిర్వహించిన సమావేశంలో మిథిలా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను ఇక్కడికి రాకుండా అడ్డుకునేందుకు స్థానిక నేతలు, అధికారులు ఎంతో ప్రయత్నించారని అన్నారు. అన్ని అడ్డంకుల్నీ అధిగమించి వచ్చానని చెప్పారు. ఈ ఏడాది చివర్లో బీహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే బీహార్లో యువతతో మమేకమయ్యేందుకు తలపెట్టిన ‘శిక్షా న్యారు సంవాద్’ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ సందఠ్భంగా మిథిలా యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ” ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు అధికారపార్టీ నాయకులు, అధికారులు ఎంతో ప్రయత్నించారు. యూనివర్సిటీ గేటు బయటే నా కారును నిలిపివేశారు. అయినా, నేను వెనకడుగు వేయలేదు. నడుచుకుంటూ సభా వేదిక మీదికి చేరుకున్నాను. బీహార్ ప్రభుత్వం నన్ను ఎందుకు ఆపలేకపోయిందో తెలుసా? మీ అందరి అభిమానమే నన్ను ముందుకు నడిపించింది. ఇదే శక్తి నరేంద్ర మోడీని గద్దె దించుతుంది. ప్రతిపక్షాల డిమాండ్ మేరకే కులగణను మోడీ అంగీకరించారు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసు” అని రాహుల్ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కాకుండా…అంబానీ, అదానీల కోసమే పని చేస్తోందని రాహుల్ విమర్శించారు. కేవలం ఐదుశాతం మంది ప్రజల ప్రయోజనాల కోసమే మోడీ ప్రభుత్వం క ృషి చేస్తోందన్నారు. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు ఈ ప్రభుత్వంలో స్థానం లేదని, కార్పొరేట్ వ్యక్తులకే మోడీ గవర్నమెంట్ వత్తాసు పలుకుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో చేపట్టిన విధంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, ప్రయివేటు కళాశాలలు, యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం కేటాయించిన నిధులను విడుదల చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా వీటిని సాకారం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
అందుకే కులగణనకు ప్రధాని అంగీకారం
- Advertisement -
- Advertisement -