నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం విడుదల చేయనుంది. ఈ నెల 18న ఉదయం (మంగళవారం) ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల ఫిబ్రవరి కోటా టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఆసక్తి కలిగిన భక్తులు వీటిని బుక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
ఆర్జిత సేవా టికెట్లను ఎలక్ట్రానిక్ లక్కీడిప్ ద్వారా జారీ చేస్తారు. లక్కీడిప్ రిజిస్ట్రేషన్కు ఈనెల 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు నవంబర్ 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఇక కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా విడుదల మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది.
అదేవిధంగా అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్ల కోటాను 11 గంటలకు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను నవంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ప్రత్యేక ప్రవేశదర్శనం రూ.300 టికెట్ల కోటాను నవంబర్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. తిరుమల, తిరుపతిల్లో అద్దె గదుల బుకింగ్ కోటా మధ్యాహ్నం 3 గంటలకు జారీ అవుతుంది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లోనే ఆర్జిత సేవలు, సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ వెల్లడించింది.



