నవతెలంగాణ-హైదరాబాద్ : సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందడంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలని సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిని ఆదేశించారు. ప్రయాణికుల్లో రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించాలన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సౌదీ ఎంబసీతో మాట్లాడాలని ఆదేశించారు. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సూచించారు. మరోవైపు బస్సు ప్రమాదం దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
తెలంగాణ సచివాలయంలో: +91 79979 59754, +91 99129 19545.
జెడ్డాలోని భారతీయ ఎంబసీలో: 80024 40003
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తోన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 42 మంది సజీవదహనమయ్యారు. వీరంతా భారతీయ యాత్రికులేనని, మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీ వాసులని సమాచారం. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి



