జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ భాస్కరరావు కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుండి 41 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 29, ఎస్సీ వెల్ఫేర్ 4, జిల్లా పంచాయతీ 2, ఎంప్లాయిమెంట్ టీమ్, మత్స్య శాఖ, మార్కెటింగ్, ఆర్.టి.సి, చీఫ్ ప్లానింగ్ , పోలీస్ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో డిఆర్ఓ జయమ్మ, జడ్పీ సీఈవో శోభారాణి,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


