మూడు దశల్లో పోలింగ్ ప్రక్రియ
డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికల నిర్వహణకు చర్యలు : జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఎస్ఈసీ ఆదేశం
సీఎస్, డీజీపీతో కలిసి వీడియో కాన్ఫరెన్స్
రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను 25న ప్రకటించే అవకాశముంది. మూడు దశల్లో నిర్వహించే ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది. గురువారం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్లోని ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నుంచి సీఎస్ రామకృష్ణరావు, డీజీపీ శివధర్రెడ్డితో కలిసి కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల ప్రచురణ, ఎన్నికల నిర్వహణకు రవాణా ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది కేటాయింపు, పరిశీలకుల మోహరింపు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. సమీక్షలో ఎన్నికల పరిశీలకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకుండా సిఫారసు చేసింది. డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఈనెల 24న హైకోర్టు విచారణకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈనెల 24 లేదా 25న షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. 12,733 పంచాయతీ, 1,12,288 వార్డుల్లో మూడు విడతల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. మొత్తం పోలింగ్ ప్రక్రియను డిసెంబరు 16 వరకు పూర్తి చేయనున్నట్టు సమాచారం.



