జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో 18 ఎజెండాలు
6 అంశాలకు ఆమోదం, వివిధ పనులకు సిఫారసు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు అభివృద్ధి పనులకు అమోదం లభించింది. 18 ఎజెండా అంశాలు, 6 టేబుల్ ఐటమ్లకు ఆమోదం తెలిపింది. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లను వెడల్పు చేయడం, జంక్షన్ల నిర్మాణం, స్టార్ వాటర్ డ్రైన్ నిర్మాణంతోపాటు పలు ప్రాంతాల్లో రోడ్ డెవలప్మెంట్కు ఆమోదం తెలిపారు. దానికి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి కార్పొరేషన్కు సిఫారసు చేశారు.
మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, ప్రాథమిక ఆహార పరీక్షా ప్రయోగశాల ఏర్పాటుకు అనుమతి కోరారు. కంటోన్మెంట్లో ఏఓసీ సెంటర్ చుట్టూ ఫ్లైఓవర్తోపాటు ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం, పలు అభివృద్ధి కార్యాక్రమాలు, రోడ్ల వెడల్పు కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ‘సీఇఓ’ నుంచి ఆమోదం పొందడానికి సిఫారసు చేశారు. అభివృద్ధి పనులకు బడ్జెట్ను కేటాయించాలని కార్పొరేషన్ను కోరారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి.కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సయ్యద్ మిన్హాజుద్దీన్, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, పర్వీన్ సుల్తానా, మహ్మద్ సలీం, డా.ఆయేషా హుమేరా, మహాలక్ష్మి రామన్ గౌడ్, సిఎన్.రెడ్డి, మహమ్మద్ బాబా ఫసియుద్దీన్, బూరుగడ్డ పుష్ప, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.



