నవతెలంగాణ – హైదరాబాద్: హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, త్వరలో హైదరాబాద్లో నిర్వహించనున్న తన ఆత్మకథ తెలుగు అనువాదం ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా దత్తాత్రేయ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. సీనియర్ రాజకీయ నాయకుడైన బండారు దత్తాత్రేయ తన రాజకీయ, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఈ ఆత్మకథను రచించారు. ఈ పుస్తకం ఇప్పటికే హిందీలో ‘జనతా కీ కహానీ, మేరీ ఆత్మకథా’ పేరుతో విడుదలైంది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఈ హిందీ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు తెలుగు పాఠకుల కోసం ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పేరుతో దీనిని తీసుకువస్తున్నారు. హైదరాబాద్లో జరగబోయే ఈ తెలుగు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దత్తాత్రేయ స్వయంగా కలిసి ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హర్యానా గవర్నర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES