Friday, June 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుముందుకెలా వెళ్దాం

ముందుకెలా వెళ్దాం

- Advertisement -

– కంచ గచ్చిబౌలి భూములపై సర్కార్‌ మల్లగుల్లాలు
– డీమ్డ్‌ ఫారెస్ట్‌గా ప్రకటిస్తే పరిస్థితేంటి?
– మొక్కలు నాటేందుకు ఎంత సమయం పడుతుంది?
– తీసుకున్న రుణాన్ని ఇతర భూముల పేర మళ్లించవచ్చా?
– చెట్ల తొలగింపుతో సంబంధమున్న అధికారుల్లో ఆందోళన
– న్యాయ నిపుణులు, ఆర్థిక వేత్తలతో ప్రభుత్వం సమాలోచనలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇటీవలి కాలంలో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఎదుర్కోని సంక్లిష్ట పరిస్థితిని తెలంగాణలోని కాంగ్రెస్‌ సర్కార్‌ ఎదుర్కొంటోంది. ముందు చూపు లేకుండా కొంత మంది అధికారుల సలహాతో తీసుకున్న నిర్ణయం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల జోలికెళ్లడం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మసక బార్చింది. వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తటంతోపాటు తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ క్రమంలో ఆ భూములను తనఖా పెట్టి తీసుకున్న రూ.10 వేల కోట్ల రుణం, తొలిగించిన చెట్ల పునరుద్ధరణపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ వివాదానికి సాధ్యమైనంత తొందరగా పుల్‌స్టాప్‌ పెట్టాలనే ఆలోచనతో న్యాయ నిపుణులు, ఆర్థిక వేత్తలతో చర్చలు జరుపుతోంది. హెచ్‌సీయూకు చెందిన 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములు సాంకేతికంగా తమవేనంటూ పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం, వాటిని గతేడాది జూన్‌లో జీవో నెంబర్‌ 54 ద్వారా తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కి అప్పగించింది. అదే ఏడాది అక్టోబర్‌ 18న ఈ భూములపై రుణం తీసుకునేందుకు అనుమతినిస్తూ జీవో 24ను జారీ చేసింది. డిసెంబర్‌ 6న టీజీఐఐసీ ఆ 400 ఎకరాల భూ హక్కులను బీకాన్‌ ట్రస్టీషిప్‌ లిమిటెడ్‌కు బదలాయిస్తున్నామని పేర్కొంటూ ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం మధ్యవర్తి సంస్థ అయిన బీకాన్‌ ట్రస్టీషిప్‌ లిమిటెడ్‌ ద్వారా భూములను తనఖా పెట్టి, సంబంధిత బాండ్ల ద్వారా రూ.10 వేల కోట్ల మొత్తాన్ని సేకరించింది. అయితే ఈ భూములు డీమ్డ్‌ ఫారెస్ట్‌గా ప్రకటించాలన్న కేంద్ర సాధికారిక కమిటీ సిఫారసు మేరకు, తొలిగించిన చెట్లను తిరిగి నాటాలంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ భూములపై తీసుకున్న అప్పుపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఇప్పుడు ప్రభుత్వం కిందామీదా పడుతోంది. ఫారెస్ట్‌ భూములపై అప్పులు తీసుకోవచ్చా? అనే అంశంపై అటవీ అధికారులతో మంతనాలు జరిపింది. అయితే అలాంటిది కుదరదని అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం. అలాంటప్పుడు భూములను తనఖా పెట్టుకుని, రుణం ఇచ్చిన సంస్థ ఈ విషయంలో ఊరుకుంటుందా? అనే ఆందోళనను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీనికి పుల్‌స్టాప్‌ పెట్టాలని సర్కార్‌ భావిస్తోంది. ఈ విషయంలో మొండిగా ముందుకెళితే రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలకు దిగే ప్రమాదముందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. తీసుకున్న అప్పుకు గాను ఇతర ప్రభుత్వ భూములను తనఖా పెట్టటంతోపాటు సుప్రీం ఆదేశాల మేరకు తొలగించిన చెట్లను పునరుద్ధరించేందుకు వీలుగా సమయం కోరాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
అధికారుల్లో ఆందోళన..
కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల తొలిగింపుపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) నివేదిక, అనంతరం సుప్రీం ఇచ్చిన మద్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఈ అంశంతో సంబంధ మున్న అధికారులు ఆందోళన చెందుతున్నారు. చెట్లను పునరుద్దరించకుంటే తాత్కాలికంగా అక్కడే ఏర్పాటు చేసే జైలుకు వెళ్లేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని సుప్రీం పలు మార్లు హెచ్చరించిన సంగతి విదితమే. ఈ క్రమంలో సర్కార్‌ తీసుకునే నిర్ణయంపైనే చెట్ల తొలిగింపులో పాల్గొన్న అధికారుల భవితవ్యం అధారపడి ఉంది. కాగా రెవెన్యూ చట్టం ప్రకారం టీజీఐఐసీకి భూములు బదిలీ కాలేదని నిపుణులు అంటున్నారు. యాజమాన్యపు హక్కులు బదిలీకాకుండానే వారాంతపు సెలవుల్లో డజన్ల కొద్ది బుల్డోజర్లతో మూడు రోజుల్లోనే వందెకరాలను చదును చేశారు. అక్కడ తొలగించిన చెట్లను ఎక్కడికి తరలించారు? ఏం చేశారనే దానిపై వారు సమాధానం చెప్పేందుకు దాట వేస్తున్నారు. ఐఏఎస్‌లైనా, ఐపీఎస్‌లైనా, ఏ ఇతర ఉన్నత స్థాయి అధికారులైనా చట్ట పరిధిలో పని చేసేంత వరకే వారు తమ అధికారాన్ని చెలాయించగలుగుతారు. అలాగాకుండా చట్ట పరిధిని అతిక్రమిస్తే ఎప్పుడో ఒకప్పుడు తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో సిన్సియర్‌ అధికారిగా గుర్తింపు పొందిన ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి ఉదంతమే ఇందుకు నిదర్శనం. కేబినెట్‌తోపాటు మంత్రి నోట్‌ ఫైల్‌ ‘కేప్టివ్‌’ అని ప్రస్తావిస్తే, దాన్ని తీసేసి అప్పటి అగ్రనేత ఆదేశం మేరకు శ్రీలక్ష్మి జీవో జారీ చేశారు. కేప్టివ్‌ అంటే మన సొంత ఉత్పత్తి కోసం ముడిఖనిజం వాడుకోవడం. కానీ ఆ పదాన్ని తీసేయడంతో గాలి జనార్థన్‌రెడ్డి గనులను అడ్డగోలుగా తవ్వుకుని విదేశాలకు అమ్ముకున్నారు. దీంతో శ్రీలక్ష్మి కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆమె ఉదంతాన్ని ఒక కేస్‌ స్టడిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.

నివేదికలో….

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను వన్యప్రాణుల రక్షణ చట్టం-1972 నిబంధనల మేరకు రిజర్వు ఫారెస్టుగా ప్రకటించాలని కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) సిఫార్సు చేసింది. భూమి నిర్వహణను కూడా అటవీ శాఖకు అప్పగించాలని అభిప్రాయపడింది. ఫారెస్టు సర్వే ఆఫ్‌ ఇండియా సదరు భూములపై చేసిన అధ్యయనాన్ని పరిశీలించగా 56 శాతం అటవీ ప్రాంతమేనని తేలింది. దీనిపై ప్రభుత్వం అటవీ ప్రధాన సంరక్షణాధికారి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌, భూ యాజమాన్య విభాగాల సీనియర్‌ అధికారులు, న్యాయ నిపుణులు, పర్యావరణ శాస్త్రవేత్తలతో కూడిన ఉన్నతస్థాయి సమన్వయ కమిటీని వేసింది. సంస్థాగత భూములను గుర్తించాలని కోరింది. మరోవైపు తడి భూముల (సంరక్షణ-నిర్వహణ) నియమాలు-2017 ప్రకారం ఈ ప్రాంతంలోని అన్ని నీటి వనరులను రక్షించేందుకు, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవహించే అన్ని మురుగునీటి అవుట్‌లెట్ల మూసివేతకు వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా లేదా మరో ప్రముఖ సంస్థ ద్వారా కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి సమగ్ర పర్యావరణ అంచనా వేయించాలని నివేదికలో సీఈసీ సిఫార్సు చేసింది. పారిశ్రామిక పార్కు కోసం పాక్షికంగా తొలగించిన చెట్లను నాటి పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించింది. రాష్ట్రంలోని అటవీ భూముల పరిశీలన కోసం క్షేత్రస్థాయి అటవీ అధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, ఐటీ, రిమోట్‌ సెన్సింగ్‌ నిపుణులు, సర్వే ఏజెన్సీలతో కమిటీని పునర్‌ నియమించాలని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -