తొలి దశలో భారీగా పోలింగ్
తిరువనంతపురం : కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంగళవారం జరిగిన తొలి దశలో భారీగా పోలింగ్ నమోదయింది. మంగళవారం ఏడు జిల్లాల్లో తొలి దశ పోలింగ్ను నిర్వహించారు. సాయంత్ర 6 గంటల సమయానికి మూడు జిల్లాల్లో పోలింగ్ 70 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది. తిరువనంతపురం, కొల్లాం, పథనంథిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాల్లో తొలి దశ జరిగింది. వీటిలో ఎర్నాకుళం జిల్లాలో అత్యధికంగా 73.36 శాతం, అలప్పుజలో 72.74 శాతం, ఇడుక్కిలో 70.26 శాతం నమోదయింది. కొట్టాయంలో 69.77 శాతం, కొల్లాంలో 69.32 శాతం, తిరువనంతపురంలో 65.93 శాతం, పథనంథిట్టలో 65.91 శాతం పోలింగ్ నమోదయింది. మంగళవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమయింది. 595 స్థానిక సంస్థలకు ఈ తొలి దశలో ఎన్నికలు జరిగాయి. రెండో దశ ఈ నెల 11న జరగనుంది. ఈ నెల 13న ఫలితాలు వెల్లడించనున్నారు.తిరువనంతపురంలోని ఒక పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి, సినీ నటులు సురేష్ గోపి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, తిరువనంతపురంలో క్యూలైన్లో నిల్చున్న ఒక వృద్ధ మహిళా ఓటర్ మృతి చెందారు. పట్టణంలోని తిరువల్లం వార్డులోని పచలూర్ స్కూల్లో ఏర్పాటు చేసిన బూత్ నంబర్6లో 73 ఏండ్ల శాంత అనే ఓటర్ తన ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం క్యూలైన్లో వేచిచూస్తున్నారు. అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకుని వెళ్లేసరికి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
దొంగ ఓట్లను వేయడానికి బీజేపీ ప్రయత్నం
తొలి దశ ఎన్నికల్లో గూండాలు దొంగ ఓట్లను వేయడానికి బీజేపీ ప్రయత్నించింది. దీన్ని పోలింగ్ అధికారులు, సీపీఐ(ఎం) కార్యకర్తలు అడ్డుకోవడంతో వారి మరింతగా రెచ్చిపోయారు. దాడులకు ప్రయత్నించారు. అయితే దీన్ని పోలీసులు, సీపీఐ(ఎం) మద్దతుదారులు నిరోధించి వారిని తరిమికొట్టారు. ఈ ఘటన కొట్టియూర్ పంచాయితీలోని 14వ వార్డులోని ఒక పోలింగ్ బూత్లో జరిగింది. ఈ బూత్ క్యూలైన్లలో కొంత మంది అనుమానితులు నిలుచున్నారు. వీరి పేర్లు ఓటింగ్ జాబితాలో లేవు. పైగా వీరి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవు. దీంతో ప్రెసిడింగ్ అధికారి వీరిని ఓటు వేయడానికి అనుమతించలేదు. అయితే వీరికి మద్దతు స్థానిక బీజేపీ అభ్యర్థి ప్రసన్న సతీసన్, ఇతర పార్టీ నాయకులు వచ్చారు. అనుమానితుల్ని ఓట్లు వేయడానికి అనుమతించాలని పోలింగ్ అధికారుల్ని బెదిరించారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు, సీపీఐ(ఎం) మద్దతుదారులు రంగంలోకి దిగి.. బీజేపీ గూండాల్ని అక్కడి నుంచి తరిమికొట్టారు.
కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు షురూ
- Advertisement -
- Advertisement -



