నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ కే-పాప్ సింగర్ హెసూ బలన్మరణానికి పాల్పడింది. తక్కువ వయసులోనే మంచి పాపులారిటీ గడించిన ఈ 29 ఏళ్ల కొరియన్ సింగర్.. తన హోటల్ గదిలో సూసైడ్ చేసుకుంది. మే 20వ తేదీన షెడ్యూల్ చేసిన ఒక ఈవెంట్కి హెసూ హాజరు కావాల్సి ఉండేది. కానీ, ఈలోపే ఆమె సూసైడ్ చేసుకోవడంతో, ఆమె మరణవార్తను ఆర్గనైజర్లు మీడియాకు తెలిపారు. ఆమె మరణవార్త అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అక్కడ ఒక సూసైడ్ నోట్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. అందులో ఉన్న వివరాల్ని మాత్రం ఇంతవరకు బయటపెట్టలేదు. అధికారులు దాన్ని గోప్యంగానే ఉంచారు. దీంతో.. హెసూ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అనే కారణాలు తెలియరాలేదు. బహుశా కుటుంబ సమస్యల కారణాల వల్లనో, లేక ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడం వల్లనో ఆమె సూసైడ్ చేసుకొని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. అసలు కారణాలేంటన్నది ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఆమె ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఎలాంటి అవకతవకలు జరిగే ప్రసక్తి లేదని, పారదర్శకంగా విచారణ చేపడతామని తేల్చి చెప్పారు.