50 వాహనాల ఢీ ..
17 వాహనాలకు వ్యాపించిన మంటలు..
ఒకరు మృతి,26 మందికి గాయాలు
మినాకామి : జపాన్లోని గున్మా ప్రిఫెక్చర్లోని మినాకామి పట్టణం సమీపంలో కన్-ఎత్సు ఎక్స్ప్రెస్వేపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారీ హిమపాతం, రోడ్డుపై గడ్డకట్టిన మంచు కారణంగా 50కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో 26 మంది గాయపడ్డారు. ప్రమాదం తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించి, అనేక వాహనాలు కాలి బూడిదయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో భారీగా కురుస్తున్న మంచు కారణంగా తొలుత రెండు ట్రక్కులు ఢీకొన్నాయి.
రోడ్డుపై ఐస్ గడ్డకట్టి ఉండటంతో, వాటి వెనుక వస్తున్న వాహనాలు బ్రేకులు వేయలేక ఒకదాని వెనుక ఒకటి ఢీకొంటూ వెళ్లాయి. క్షణాల్లోనే 50కి పైగా వాహనాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగి, సుమారు 17 వాహనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సుమారు ఏడున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో టోక్యోకు చెందిన 77 ఏండ్ల మహిళ మరణించినట్టు పోలీసులు ధ్రువీకరించారు. గాయపడిన 26 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.



