Tuesday, December 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅక్షర జాతరకు రికార్డు నీరాజనం!

అక్షర జాతరకు రికార్డు నీరాజనం!

- Advertisement -


– ముగిసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్..
– 16 లక్షల మందితో సరికొత్త చరిత్ర
– సెల్ ఫోన్ల కంటే పుస్తకాలకే యువత మొగ్గు: జస్టిస్ సుదర్శన్ రెడ్డి
– రాజ్యాంగాన్ని ‘పాకెట్ సైజు’లో సామాన్యులకు అందించాలి

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున 11 రోజుల పాటు సాగిన అక్షరాల పండుగ ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ రికార్డు స్థాయి సందర్శకులతో ముగిసింది. ముగింపు సభకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, భారత రాజ్యాంగాన్ని పాకెట్ సైజులో సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. సెల్ ఫోన్లు, సినిమాలకు దూరంగా యువత ఇంత పెద్ద ఎత్తున తరలిరావడం సమాజ మేధో అంతర్మథనానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి వాసు వార్షిక నివేదికను సమర్పిస్తూ.. గత ఏడాది 12 లక్షల మంది రాగా, ఈసారి ఆ సంఖ్య ఏకంగా 16 లక్షలకు చేరుకుందని, అందులో 70 శాతం మంది యువతే ఉండటం విశేషమని వెల్లడించారు. 368 స్టాళ్లతో సాగిన ఈ మేళాను ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఒక ‘మిలియన్ మార్చ్’గా అభివర్ణించగా, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పఠనాసక్తిలో భారత్ త్వరలోనే అమెరికాను తలదన్ని అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజ్యాంగం అందరికీ అందాలి.. వేదికలపై మహిళా ప్రాతినిధ్యం పెరగాలి: జస్టిస్ సుదర్శన్ రెడ్డి
ప్రస్తుత డిజిటల్ యుగంలో సెల్ ఫోన్లు, సినిమాలకు దూరంగా యువత ఇంత పెద్ద ఎత్తున పుస్తక ప్రదర్శనకు రావడం సమాజంలోని మేధో అంతర్మథనానికి నిదర్శనమని జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. భావప్రకటన స్వేచ్ఛకు ఈ వేదిక అద్దం పడుతోందని, గాంధీజీ నుంచి ఆయనను విమర్శించే వారి వరకు అందరి పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉండటం శుభపరిణామమని కొనియాడారు. పుస్తకాలు కేవలం సమాచారం కోసం కాకుండా, మనిషిలో స్వతంత్ర ఆలోచనలను రేకెత్తించే సాధనాలుగా ఉండాలని లోహియా మాటలను గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులకు ఒక కీలక సూచన చేశారు. భారత రాజ్యాంగాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగులో పాకెట్ సైజు ప్రతిగా ముద్రించి, అతి తక్కువ ధరకు వచ్చే ఏడాది అందుబాటులో ఉంచాలని కోరారు. ఇందుకు ఎవరూ ముందుకు రాకపోతే తాను స్వయంగా తోడ్పాటు అందిస్తానని ప్రకటించారు. అదేవిధంగా, వేదికలపై మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సమానత్వం గురించి కేవలం మాటల్లో కాకుండా, పుష్ప చక్రపాణి వంటి మేధావులను వేదికలపైకి ఆహ్వానించి ఆచరణలో చూపాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, కె. రామచంద్రమూర్తి, గంటా చక్రపాణి, రమా మెల్కోటే తదితరులు పాల్గొన్నారు.
ముగింపు సభలో ప్రముఖుల ప్రసంగాలు:
కవి యాకూబ్ – (బుక్ ఫెయిర్ అధ్యక్షులు): “పుస్తక ప్రదర్శన కేవలం మేళా కాదు, సామాజిక చైతన్య కేంద్రం. యువత అక్షరాల పండుగకు ఇస్తున్న గౌరవం భవిష్యత్తు తరాలకు ఒక గొప్ప సూచిక. 38 ఏళ్ల ఈ ప్రయాణంలో పాఠకుల ఆదరణ మరువలేనిది.”
ఆర్. శ్రీనివాస్ (బుక్ ఫెయిర్ కార్యదర్శి): “11 రోజుల్లో 16 లక్షల మందిని ఆకర్షించి పాత రికార్డులను తిరగరాశాం. 450 స్టాళ్లను పారదర్శక లాటరీ పద్ధతిలో కేటాయించాం. సోషల్ మీడియా ద్వారా పాఠకులే ఈ వేడుకను ప్రజల ఉత్సవంగా మార్చారు.”

బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి : ” 280 మందికి పైగా క‌వులు ర‌చ‌యిత‌లు ఈ వేదిక‌పై మాట్లాడారు…. అదే హైద‌రాబాద్ బుక్ ఫెయిర్‌కు గ‌ర్వ‌కార‌ణం. అంతేకాకుండా ప‌ల్లెకు పుస్త‌కం అనే నినాదంతో పుస్త‌కాలు డొనేష‌న్లు కోర‌గా కొన్ని వేల పుస్త‌కాలు రావ‌డం గొప్ప విష‌యం. “

అంబేద్క‌ర్ విశ్వ‌విద్యాల‌యం వీసి ఘంటా చక్రపాణి: “విశ్వవిద్యాలయాల పరిశోధనా పత్రాలను ప్రజలకు చేరువ చేయాలి. కేవలం అమ్మకాలే కాకుండా కులతత్వం, మతత్వం వంటి సామాజిక సమస్యలపై లోతైన చర్చలు నిర్వహించి పాఠకులలో అవగాహన కల్పించాలి.”

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌ కె. శ్రీనివాస్ రెడ్డి: “ఆర్థిక రంగంలో కంటే పుస్తక పఠనంలో మనం ప్రపంచ అగ్రగామిగా ఎదగాలి. వ్యవసాయ, పశుసంవర్ధక పరిశోధనలు రైతులకు అందుబాటులోకి తేవాలి. పుస్తక విరాళాల కార్యక్రమం ఒక గొప్ప సామాజిక ఆశయం.”

ప్రొఫెసర్ కోదండరాం: “యువత మద్యం, గంజాయి వంటి వ్యసనాలను వీడి పుస్తక పఠనాన్ని వ్యసనంగా మార్చుకోవాలి. తలవంచుకుని పుస్తకం చదివితే సమాజంలో తలెత్తుకుని జీవించే శక్తి లభిస్తుంది.”

సీనియ‌ర్ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి: “హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను అంతర్జాతీయ స్థాయి ‘లిటరరీ ఫెస్టివల్’గా మార్చాలి. జాతీయ మేధావులను ఆహ్వానించి విభిన్న విచారధారలపై పది రోజుల పాటు చర్చలు నిర్వహించాలి.”

రమా మెల్కోటే: “ప్రతి ఏటా స్టాళ్ల ఏర్పాటు వ్యయాన్ని తగ్గించేందుకు స్టేడియంలో శాశ్వత కట్టడాలు నిర్మించాలి. విద్యా వ్యవస్థను అకడమిక్ పరంగా అభివృద్ధి చేయడానికి ఈ ఉత్సాహాన్ని ప్రేరణగా తీసుకోవాలి.”

ముగింపు సభలో చాకలి ఐలమ్మ వర్సిటీ విసి ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రదర్శన విజయంపై సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ పుస్తక ప్రదర్శన ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రదర్శనను పొడిగించలేకపోతున్నామని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -