సావిత్రిబాయి జయంతి కార్యక్రమంలో వక్తలు
నవతెలంగాణ – ముషీరాబాద్
తాత్వికత అంటే సమాజంలో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించడం అని సావిత్రిబాయి జయంతి కార్యక్రమంలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ముషీరాబాద్లోని ఎస్.ఆర్.శంకరన్ ఐఏఎస్ అకాడమీలో సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి, అలాగే అకాడమీ పదో వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ‘ఫూలే తాత్విక భావనలు’ అన్న అంశంపై సెమినార్ జరిగింది. ఎస్ఆర్. శంకరన్ ఐఏఎస్ అకాడమీ ప్రిన్సిపల్ కె.సురేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె.సతీష్ కుమార్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భం గా ఎక్స్ఐఓఎఫ్ఎస్ కమర్షియల్ ట్యాక్సెస్ రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ వై.సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రశ్నించినప్పుడే జ్ఞానం వస్తుందని, అలాంటి అంశాల్ని సావిత్రిబాయి ఫూలే, మహాత్మ జ్యోతిబాఫూలే ఇద్దరూ కలిసి ఈ సమాజానికి ఒక సందేశంగా అందించారని కొనియాడారు.
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు మాట్లాడుతూ.. ఫూలే దంపతులు వారి సహచర్యంతో సమాజంలో వస్తున్న దురాచారాల పై పెద్దఎత్తున పోరాటం నిర్వహించారని తెలిపారు. ఈ వ్యవస్థలో మార్పు జరగాలంటే కచ్చితంగా విద్య అవసరమని, దానికి స్త్రీవిద్య అవసరం అనే దాన్ని ఎక్కువగా భావించి జ్యోతిబాఫూలే తన భార్యని టీచరుగా తీర్చిదిద్దిన విషయాన్ని మర్చిపోరాదన్నారు. సావిత్రిబాయి ఫూలే సర్టిఫైడ్ టీచర్ అయిన తర్వాత మహారాష్ట్రతోపాటు మొత్తం భారతదేశం అంతా మహిళా అభ్యున్నతి కోసం, విద్య కోసం కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ ఎడిటర్ కోట మురళీకృష్ణ, సిబ్బంది గాజర్ల రమ, సుమన్ దలోడ్, బి.సంధ్యారాణి, అలివేలమ్మ, బి.రంజిత్ కుమార్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



