నలుగురు వర్సిటీ సిబ్బంది సస్పెన్షన్
సుమారు 35 మంది ఇన్ సర్వీస్ బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్థుల డిస్మిస్
ప్రక్షాళనే తదుపరి కర్తవ్యం : వీసీ జానయ్య
నవతెలంగాణ-రాజేంద్రనగర్
వ్యవసాయ వర్సిటీలో ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మూడవ సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు చదువుతున్న సుమారు 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేసి, వారిని తిరిగి వ్యవసాయ శాఖకి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఉప కులపతి ప్రొఫెసర్ అల్డాస్ జానయ్య, ఇతర అధికారులతో కలిసి జగిత్యాల వ్యవసాయ కళాశాలని సందర్శించారు. వివిధ రకాల రికార్డుల పరిశీలన, సీసీ ఫుటేజ్ల ఆధారంగా సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకవుతున్నట్టు అనుమానించారు. ఈ అంశాన్ని సమగ్రంగా విచారణ చేసేందుకు ముగ్గురు అధికారులతో కమిటీని నియమించారు.
ఈ కమిటీ అన్ని కోణాల నుంచి విచారణ నిర్వహించింది. వ్యవసాయ శాఖలో ఏఈఓలుగా పని చేస్తూ వ్యవసాయ వర్సిటీలో ఇన్ సర్వీస్ కోటాలో 3వ ఏడాది బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సుమారు 35 మంది అభ్యర్థులు ఒక పథకం ప్రకారం సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నా పత్రాలను వర్సిటీ సిబ్బంది సహకారంతో లీక్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో ఇతర వ్యవసాయ కళాశాలల విద్యార్థులకి పంపారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు తేల్చారు. ఒక పథకం ప్రకారం కొన్నేండ్లుగా ఈ వ్యవహారం జరుగుతోందని నిర్ధారించారు. వర్సిటీ ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఒక ఉన్నతాధికారి సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా వ్యవసాయ శాఖ నుంచి ఇన్ సర్వీస్ కోటాలో వచ్చిన సుమారు 35 మందిని డిస్మిస్ చేస్తూ వారిని వ్యవసాయ శాఖకి తిరిగి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రకాళనే తదుపరి కర్తవ్యం: ఉపకులపతి
2014 నుంచి 2024 వరకూ పూర్తి స్థాయిలో విశ్వ విద్యాలయంలో ఉన్నతాధికారులు లేకపోవడంతో ఎన్నో అవకతవకలు జరిగాయని, ప్రశ్నా పత్రాల లీకేజీ కుంభకోణం అందులో ఒకటని ఉప కులపతి అల్డాస్ జానయ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ప్రక్షాళన మొదలు పెట్టి బాధ్యులైన వారిని సస్పెండ్ చేశామని వివరించారు. అవసరం అయితే సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ చేయాలని కోరతామన్నారు. ఈ అంశానికి సంబంధం ఉన్నవారిని వదిలి పెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్లో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదే విధంగా ప్రస్తుత పరీక్షల విధానాన్ని సమగ్రంగా సమీక్షంచి, ఆధునిక టెక్నాలజీ సాయంతో అవసరమయిన సంస్కరణలు తీసుకొచ్చి వ్యవసాయ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచుతామని తెలిపారు.



