నవతెలంగాణ – నిజాంసాగర్
గ్రామీణ రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం, మట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ ఎం ఎన్ ఎఫ్) పథకం పై రైతులకు శుక్రవారం వడ్డేపల్లి గ్రామంలోని రైతు వేదికలో అవగాహన కల్పించడం జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సహజ వనరుల ఆధారిత వ్యవసాయం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు ఆయన వివరించారు. ముఖ్యంగా సహజ వ్యవసాయ విధానాలు, జీవామృతం, ఘనజీవామృతం తయారీ విధానాలు, దేశీ ఆవుల ప్రాముఖ్యత, మట్టిలో సూక్ష్మజీవుల పాత్ర, పంట వ్యయాలు తగ్గించి లాభాలు పెంచుకునే మార్గాలు వంటి అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందని ఆయన అన్నారు.కార్యక్రమంలో ఏఈఓ సాగర్, వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ అంజయ్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.



