జేఏసీ నాయకులకు సీఎం రేవంత్రెడ్డి హామీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జవహర్నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీనిచ్చారు. జవహర్నగర్ డంపింగ్ యార్డు జేఏసీ సభ్యులు కాంగ్రెస్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రేశ్ యాదవ్ నేతృత్వంలో సోమవారం సీఎంను ఆయన నివాసంలో కలిసి సమస్యను వివరించారు. సానుకూలంగా స్పందించిన సీఎం సంబంధిత అధికారులతో మాట్లాడి ఈనెల 15 వరకు పూర్తి స్థాయి నివేదిక కావాలని ఆదేశించారు. ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపాలో, త్వరలోనే నూతనంగా ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డులపై అభిప్రాయాలు తీసుకోవాలని ఆదేశించారు. మారిన పరిస్థితులను బట్టి విదేశాల్లో చెత్త సేకరణ కోసం అవలంబిస్తున్న శాస్త్రీయ పద్ధతులను అధ్యయనం చేసేందుకు అఖిలపక్ష పార్టీల కమిటీలతోపాటు అధికారుల బృందాన్ని విదేశాలకు పంపుతామని తెలిపారు. ఏండ్ల తరబడి ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై వజ్రేశ్ యాదవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ మేరకు అధికారులతో మాట్లాడిన సీఎం వంతెన వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎంను కలిసిన వారిలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు హరివర్దన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డి, కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ ముప్పు రామారావు, జేఏసీ ప్రతినిధులు శంకర్ నారాయణ, పద్మాచారి, ఏనుగు సంజీవరెడ్డి, మారం సమ్మిరెడ్డి, గావిని స్వర్ణ శ్రీనివాస్ ఉన్నారు.
దీక్ష విరమణ
జవహర్నగర్ డంపింగ్ యార్డు తొలగింపును కోరుతూ 10 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక రీలే నిరాహార దీక్షలను సీఎం రేవంత్రెడ్డి హామీ మేరకు విరమించారు.
ఈనెల 15లోపు పూర్తి స్థాయి
నివేదిక అందజేయాలి
ఘట్కేసర్ రైల్వే వంతెనను
పూర్తి చేయాలి
అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి



