- Advertisement -
- తక్షణమే ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్స్ వేయాలి
– ఉద్యోగాల సాధనకై డివైఎఫ్ఐ రాష్ట్రవ్యాప్త ఉద్యమం
– ఆనగంటి వెంకటేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నవతెలంగాణ – హైదరాబాద్:
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, తక్షణమే ఉద్యోగాల భర్తీకై నోటిఫికెషన్స్ వేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు. ఆదివారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) హైదరాబాద్ నగర 21వ జిల్లా మహాసభ సిఐటియు నగర కార్యాలయం ముషీరాబాద్ లో నిర్వహించారు. ఈ మహాసభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరైన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నిరుద్యోగులందరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాయ మాటలు చెప్పిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ ని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ తో పాటు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. - ప్రభుత్వం సమగ్ర వివరాలతో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి, తక్షణమే ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్లను వేయాలన్నారు. అదేవిధంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేంతవరకు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి రూ.4000/- ఇవ్వాలన్నారు. స్వయం ఉపాధి రుణాలపై రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించి లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయకుండా జాప్యం చేస్తోందన్నారు. అర్హులైన నిరుద్యోగ యువత అందరికి రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, స్వయానా డిజిపి ప్రకటించినా.. కేవలం 7000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు వేయడం నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుందన్నారు.
- గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు పోలీస్ శాఖలో 20వేల ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ వేయాలని ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకుండా 7 వేల ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ వేస్తామని ప్రకటించడం సరియైంది కాదని అన్నారు. అనంతరం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జావీద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోనే సుమారు పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 60 లక్షల పైగా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటిని భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఎన్నిక- డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా సునీల్ కార్యదర్శిగా జావీద్ లు ఎన్నికయ్యారు. అంతకుముందు మహాసభ ప్రారంభ సూచికంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు హస్మి బాబు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డివైఎఫ్ఐ మాజీ నాయకులు మహేందర్, విజయ్ కుమార్, అశోక్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు అశోక్ రెడ్డి, లెనిన్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు అనిల్ కుమార్, దేవేందర్, రాజయ్య, సునీల్, వేణు, శ్రీనివాస్, అన్వేష్, కృష్ణ, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -



