– వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం
– కల్లాల్లోనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ధాన్యం
– రైస్ మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి
– క్వింటాల్కు 10 కిలోల తరుగు తీయడం దోపిడీ
– ముఖ్యమంత్రి వెంటనే సమీక్షా సమావేశం నిర్వహించి కొనుగోళ్లు వేగవంతం చేయాలి
– బషీరాబాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్పల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కంట కన్నీరు పెట్టిస్తుందని బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బషీరాబాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కాక కల్లాల్లోనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడం, అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతుండటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లపై నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. బషీరాబాద్లోనే దాదాపు 125 లారీలకు సరిపడా ధాన్యం నెల రోజులుగా కొనుగోలు కోసం ఎదురుచూస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాలు పడుతున్నప్పటికీ ప్రభుత్వం లారీలు, హమాలీలు, టార్పాలిన్ల వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.రైతులు రాత్రింబవళ్లు కల్లాల దగ్గరే కాపలా కాస్తూ ధాన్యం కాపాడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టపోతుంటే ప్రభుత్వం మాత్రం ప్రకటనలకే పరిమితమవుతోందని విమర్శించారు.
మిల్లర్ల తరుగు దోపిడీపై ఆగ్రహం..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కిలోల బస్తా తీసుకోవాల్సి ఉండగా, రైస్ మిల్లర్లు 43 నుంచి 44 కిలోల వరకు అడుగుతున్నారని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. క్వింటాల్కు సుమారు 10 కిలోల వరకు తరుగు పేరుతో ధాన్యం దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పంట నాణ్యత బాగున్నా, ఎలాంటి తెగుళ్లు లేకున్నా రైతులను ఇబ్బంది పెట్టడం అన్యాయం,ఇది బహిరంగ దోపిడీ అన్నారు. వెంటనే ఈ తరుగు అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నారు.
జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే
క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నేరుగా జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా వివరించారు. వెంటనే జిల్లా స్థాయిలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిఎం, డిసిఓ, డీఎస్ఓ అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని విన్నవించారు. లారీల కొరత వెంటనే తీర్చాలని, హమాలీలను అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరొకటి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈరోజు నేను స్వయంగా కల్లాలకు వచ్చి చూస్తే రైతుల బాధ అక్షర సత్యమని అర్థమైందన్నారు. నెల రోజులుగా ధాన్యం అక్కడే ఉండటం, లారీలు రాకపోవడం, వర్షాలకు తడిసి పోవడం చూస్తుంటే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుస్తోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వెంటనే సమీక్ష నిర్వహించాలి
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని, ముఖ్యమంత్రి వెంటనే ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.గతంలో మా ప్రభుత్వ హయాంలో ప్రతిరోజూ కొనుగోళ్లపై సమీక్ష ఉండేదన్నారు. లారీలు, అమాలీలు, టార్పాలిన్ల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండేదని, ఇప్పుడు మాత్రం రైతులను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాళు తీస్తే తోలు తీస్తా అన్న ముఖ్యమంత్రి, ఇప్పుడు రైతుల వద్ద నుంచి 10 కిలోల తరుగు తీస్తున్న మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
రైతులకు అండగా ఉంటాను
ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, రైతులకు న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు జిల్లా అధికారులతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటానని తెలిపారు.బాల్కొండ నియోజకవర్గ రైతులకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు నా వంతు పోరాటం కొనసాగుతుందిని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



