నవతెలంగాణ – హైదరాబాద్ : భారత క్రికెట్లో కలకలం రేగింది. టీమిండియా యువ సంచలనాలు, స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. డోప్ టెస్టింగ్ కోసం నిర్దేశిత సమయంలో అందుబాటులో లేకపోవడంతో ‘వేర్అబౌట్స్ ఫెయిల్యూర్’ కింద వారిపై ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై బీసీసీఐ, ఐసీసీలకు కూడా ‘నాడా’ సమాచారం అందించింది. నాడా నిబంధనల ప్రకారం ‘రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ)’లో ఉన్న క్రీడాకారులు తాము డోప్ పరీక్షల కోసం అందుబాటులో ఉండే ప్రదేశం, ఒక గంట సమయం గురించి ముందుగానే సమాచారం ఇవ్వాలి. అయితే, 2025 నవంబర్ 7న డోపింగ్ కంట్రోల్ అధికారులు శాంపిల్ సేకరణకు వెళ్లినప్పుడు షఫాలీ వర్మ తాను పేర్కొన్న ప్రదేశంలో లేరు. అలాగే, 2025 డిసెంబర్ 17న యశస్వి జైస్వాల్ కూడా అందుబాటులో లేనట్లు అధికారులు గుర్తించారు.
ఈ ఘటనల అనంతరం 2026 ఫిబ్రవరిలో ‘నాడా’ వారి నుంచి వివరణ కోరినప్పటికీ, ఇద్దరు ఆటగాళ్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నాడా దీన్ని అధికారికంగా ‘మిస్డ్ టెస్ట్’గా నమోదు చేసింది. ప్రస్తుతం తమ గైర్హాజరుకు సరైన కారణం చెప్పేందుకు ఇద్దరికీ ఏడు రోజుల తుది గడువు ఇచ్చింది. యాంటీ-డోపింగ్ నిబంధనల ప్రకారం 12 నెలల వ్యవధిలో మూడుసార్లు ‘వేర్అబౌట్స్ ఫెయిల్యూర్స్’కు పాల్పడితే, దానిని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఒకవేళ నేరం రుజువై, క్రీడాకారులు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోలేకపోతే, రెండేళ్ల వరకు నిషేధానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం జైస్వాల్, షఫాలీలకు ఇది మొదటి తప్పిదం అయినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.



